Thursday 14 December 2017

పోలవరంపై విషం చిమ్మొద్దు

పోలవరంపై విషం చిమ్మొద్దు
15-12-2017 02:50:27


రైతు భరోసాను దెబ్బతీయొద్దు
రాష్ట్రానికి నష్టం చేయొద్దు: సీఎం
విమానాశ్రయంలో రైతుల ఘనస్వాగతం
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వరప్రదాయిని, జీవన రేఖలాంటి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మొద్దని.. రైతాంగం పెట్టుకున్న భరోసాను.. ధైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రానికి.. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని కోరారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి కృష్ణా డెల్టా రైతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు.

సీఎం అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో దాదాపు నాలుగు గంటలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, ఉన్నతాధికారులు, రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఇందులో పాల్గొన్నారన్నారు. గడ్కరీతో చర్చల తర్వాత పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయగలమన్న భరోసా వచ్చిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేలా విభజన జరిగిందని, కట్టుబట్టలతో వచ్చేశామని గుర్తుచేశారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై పడిందన్నారు. ‘రాష్ట్ర విభజన జరిగాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది పూర్తయ్యేలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు నీరందించాలని నిర్ణయించాం. పట్టిసీమను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వారి మాట విని కట్టకుండా ఉంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారేది. దీనిని పూర్తిచేయడం వల్లే ఖరీ్‌ఫలో బ్రహ్మాండమైన పంట దిగుబడులు వచ్చాయి’ అని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పట్టుదలతో పట్టిసీమను పూర్తిచేయడంతో రైతులకు తనపై పూర్తి నమ్మకం కలిగిందన్నారు. ఈ పథకాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే ప్రశ్నించాలని కృష్ణా డెల్టా రైతులకు సూచించారు.

‘ఆంధ్రజ్యోతి’ వార్త చదివాక గుండె బరువెక్కింది
పోలవరం టెండర్లను ఆపాలని కేంద్రం ఆదేశించినట్లు పేపర్లో వచ్చిన వార్తను చదివాక గుండె బరువెక్కిందని ముఖ్యమంత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. దక్షిణ కొరియా నుంచే గడ్కరీతో ఫోన్లో మాట్లాడానని, మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిపారు. ప్రాజెక్టు సమస్యలపై బుధవారం గడ్కరీతో సంపూర్తిగా చర్చించామని.. కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ప్రస్తుత కాంట్రాక్టు సంస్థకు నెల రోజులు గడువిచ్చారని.. లక్ష్యాలను చేరుకోలేకపోతే.. మర్నాడే కొత్త సంస్థకు కాంక్రీట్‌ పనుల బాధ్యతను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.

కొంతమంది కావాలనే పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘2013 భూ సేకరణ చట్టం అమల్లోకి రాకముందే భూసేకరణ చేపట్టి ఉంటే.. రూ.2900 కోట్లు వ్యయమయ్యేది. ఇప్పుడా చట్టం అమల్లోకి రావడంతో.. భూ సేకరణ వ్యయం 11 రెట్లు పెరిగి రూ.33,000 కోట్లకు చేరుకుంది.

ప్రధాన పనుల వ్యయం మాత్రం రెండింతలు పెరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రతిపక్షాలు అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు.. రాష్ట్రం చేసిన వ్యయాలు.. ఏ కాంట్రాక్టు సంస్థకు ఎంత చెల్లింపులు జరిపారో ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. శ్వేతపత్రాన్ని కోరుతున్న వారు ఆన్‌లైన్‌లోనే లెక్కలు చూసుకోవచ్చు. ప్రతిపక్షాలు విజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర రాద్ధాంతం సృష్టించి అన్యాయం చేయొద్దు’ అని కోరారు.

కంకుల సందడి..
తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు విమానాశ్రయంలో సందడి చేశారు. పట్టిసీమ నీటితో పండించిన పంటను తీసుకువచ్చి కంకుల దండను సీఎం మెడలో వేశారు. డప్పు వాయిద్యాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మారుమోగింది. సీఎంకు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్‌, బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.

గడ్కరీ రాక 23న
కాగా.. పోలవరం సందర్శనకు గడ్కరీ ఈ నెల 23న రానున్నారు. తొలుత ఆయన పర్యటన 22న ఉంటుందని భావించారు. అయితే.. 23న విజయవాడకు వస్తారని.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పనులను సమీక్షిస్తారని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

Friday 27 October 2017

పోలవరంపై ఏంచేద్దాం?

పోలవరంపై ఏంచేద్దాం?
28-10-2017 04:02:04

నేడు ముఖ్యమంత్రి నిర్ణయం.. అంచనాలు పెంచలేమన్న గడ్కరీ
 అధిక ధరను రాష్ట్రమే భరించాలని సూచన
 సీఎంకు నివేదించిన జల వనరుల శాఖ
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు చేపట్టిన ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొన్ని పనులు తప్పించి.. ఈ-టెండర్ల ద్వారా వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయనతో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్‌ఈ రమేశ్‌బాబు తదితరులు భేటీ అయ్యారు. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశ వివరాలను ఆయనకు వివరించారు. శనివారం మరోసారి భేటీ అయి ఏం చేయాలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వారితో అన్నారు. ‘ఈపీసీ విధానంలో పోలవరం ప్రాజెక్టుకు తాజా టెండర్లను పిలిస్తే.. అంచనాలను సవరించేందుకు ఆస్కారం లేదు. ఇలా అంచనాలను పెంచితే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుపట్టవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకూ ఆస్కారం లేకపోలేదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకూ సుముఖగా లేం’ అని గడ్కరీ తమకు తేల్చిచెప్పారని అధికారులు సీఎంకు తెలియజేశారు. ‘సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఆర్థిక రంగ నిపుణుడు, రిటైర్డ్‌ బ్యాంకు అధికారితో ఆర్బిట్రేషన్‌ కమిటీ వేయాలని గడ్కరీ సూచించారు. ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి రూ.1000 కోట్ల విలువైన పనుల నుంచి తప్పించి వేరే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అంగీకరించలేదు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పారు. పైగా.. ట్రాన్‌స్ట్రాయ్‌కే సహకారం అందించాలని, సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు నేరుగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఎస్ర్కో అకౌంట్‌ను తెరవాలని సూచించారు. ఒకవేళ ఈ- టెండర్లను పిలిస్తే.. ట్రాన్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన -14.05 శాతం కంటే ఎక్కువ ధరను చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అధిక మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేశారు’ అని వివరించారు.

పోలవరంపై దోబూచులు! 8 సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చారని, ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రం కేంద్రానికి లొంగి ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

Tuesday 9 May 2017

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు
10-05-2017 04:39:49
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి.. నిర్వాసితులైన పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు మండలాల్లోని 34 గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1660 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. వచ్చేఏడాది గ్రావిటీతో పోలవరంలో నీరు నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున ఇచ్చాం. కొంత మంది రైతులకు వడ్డీతో సహా రూ.10.92 లక్షల చొప్పున ఖాతాలో జమ చేశాం. కుక్కనూరు, వేలేరుపాడు, జీడుగుమల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో 34 గ్రామాల్లోని 14,043 ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఇందుకుగాను నిర్వాసితులకు రూ.1502 కోట్లు చెల్లించాం. అదేవిధంగా 1505 ఎకరాల అసైన్డ్‌ భూములకు సంబంధించి నిర్వాసితులకు రూ.158 కోట్లు చెల్లించాం. మొత్తం నాలుగు మండలాల్లో 15,548 ఎకరాలకు రూ.1660.75 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం’ అని వివరించారు.

నష్టపరిహారం చెల్లింపునకు కృషిచేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికారులను అభినందించారు. రైతులకు చెల్లించిన నష్టపరిహారానికి చెందిన బిల్లులను పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖకు, నాబార్డుకు పంపిస్తామని, వాటిని పరిశీలించి కేంద్రం ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వానికి రీయింబర్స్‌ చేస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7500 వందల ఎకరాలకు రూ.800 కోట్లు అవసరమని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. పోలవరం కాంక్రీట్‌, ఎర్త్‌, డయాఫ్రం వాల్‌ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌ టీ-బావర్‌ సంస్థ 633 మీటర్లలో 203 మీటర్ల పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. నవంబరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

Thursday 12 January 2017

Detailed Project Reports (DPRs)

డీపీఆర్‌ ఉంటేనే.. ప్రాజెక్టులకు అనుమతి!
Sakshi | Updated: January 13, 2017 02:56 (IST)
కొత్త మార్గదర్శకాలు రూపొందించిన కేంద్ర జల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఉంటే అనుమతులు లభించనున్నాయి. డీపీఆర్‌లు సమర్పిస్తేనే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన హైడ్రాలజీ, నీటి పారుదల ప్రణాళిక, డిజైన్లు, అంచనాలకు ఆమోదం తెలుపుతామని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల వ్యవధిని గణనీయంగా తగ్గించేందుకు.. ఏళ్లకేళ్లు జాప్యం జరిగి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఎన్నో అనుమతులు కావాలి..
సాధారణంగా ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జల సంఘం అనుమతి తోపాటు సైట్‌ క్లియరెన్స్, అంతర్రాష్ట్ర వ్యవహారా లు, పర్యావరణ, అటవీ, ప్రణాళికా సంఘం..  అనుమతులు  తీసుకోవాల్సి ఉంటుంది.

అధ్యయన నివేదికలూ ఇవ్వాల్సిందే..
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టు అనుమతులు వేగంగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి తయారు చేసిన డీపీఆర్‌ కచ్చితంగా ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్‌లో నీటి లభ్యత (హైడ్రాలజీ), నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజె క్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు వంటి అంశాలపై చేసిన అధ్యయన నివేదికలు పొందుపరచాలి. ఆ డీపీఆర్‌ను సీడ బ్ల్యూసీ పరిశీలించి..అవసరమైన మార్పులు, చే ర్పులు సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్పులు చేసి తుది డీపీఆర్‌ రూపొందించాలి. దానిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకు ప్రజెంటేషన్‌ ఇవ్వాలి.

ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ అంగీకారం తెలుపుతుంది. తర్వాత 3 వారాల్లోగా హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక, 2 వారాల్లోగా అంతర్రాష్ట్ర అనుమతులు ఇస్తారు. డిజైన్లకు 2 నెలల గడువు పట్టనుండగా.. అంచనా లు, ఆర్థిక మదింపు, సాంకేతిక సలహా మండలి నివేదిక అనుమతుల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేస్తారు. ఇక ఆయకట్టు అభివృద్ధి ప్రణాళిక, వ్యయ ప్రయోజనాల నిష్పత్తి (కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో) లను స్పష్టం చేస్తూ వ్యవసాయ శాఖ నుంచి నీటి పారుదల ప్రణాళిక డైరెక్టరేట్‌కు సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. నిర్మాణాలు చేపట్టి ఆపై అనుమతుల అంశాన్ని సాకుగా చూపుతూ, ప్రాజెక్టుల వ్యయాలను పెంచే స్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పాటిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.