Thursday 22 August 2019

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
22-08-2019 12:05:59

అమరావతి: ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ‘‘ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసింది. కేవలం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుంది. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, మేము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తాం’’ అని ‘నవయుగ’ సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి కుదిరిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్ట్ 14వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నవయుగ సంస్థ హైకోర్టులో సవాల్‌ చేసింది.

‘మా మాట వినండి! పోలవరం టెండర్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం... పైగా, ఈ సూచన చేసిన 24 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రీటెండర్‌ నోటిఫికేషన్‌తో సహా తమకు అందజేయాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్‌ను కోరిన విషయం విదితమే. పోలవరం ‘రివర్స్‌ టెండర్‌’ ప్రతిపాదనలపై ఆగస్ట్ 13న పీపీఏ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది.

పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసేందుకు, తిరిగి టెండర్లు పిలిచేందుకు ఎటువంటి కారణాలు లేవని... ‘రివర్స్‌’ వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని తేల్చింది. దీనివల్ల సామాజిక-ఆర్థిక పర్యవసానాలు కూడా ఉంటాయని కూడా తెలిపింది. ఇవే విషయాలను వివరిస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆర్కే జైన్‌ లేఖ రాశారు. రివర్స్‌ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని, కనీసం కేంద్రం నుంచి సూచనలు వచ్చేదాకా ఆగాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌పై ముందుకెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా.. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని
Aug 22, 2019, 20:39 IST
 Kodali Nani Slams Chandrababu, Devineni Uma about Palavaram - Sakshi
పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది..

సాక్షి, అమరావతి :  పోలవరంపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చిందే కాని చంద్రబాబు నాయుడు చుట్టాలకు ఆ పనులు అప్పగించాలని చెప్పలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ‍్యానించారు. ఎవరైనా కోర్టుకు వెళితే స్టే ఇవ్వడం సహజమేనని, ఆ మాత్రం దానికే టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు మారితే అంతకు ముందు నిర్మాణ సంస్ధల నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమా ఏడుస్తున్నారని ఆరోపించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని టీడీపీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అవినీతి నిర్మూలనలో అనేక వత్తిడులు ఎదురవుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలవరంపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.

రాజధానిపై అనవసర రాద్దాంతం
రాజధానిపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనవర రాద్దాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, రాజధానిని అమరావతి నుంచి తీసివేస్తామని ఆయన చెప్పలేదని స్పష్టం చేశారు. కృష్ణానదికి పెద్దగా వరదలు వచ్చినా, గట్టిగా వర్షాలు కురిసినా అమరావతి మునిగిపోతుందని ఆయన చెప్పారన్నారు. అందులోని లోపాలను గురించి బొత్స వివరించారని పేర్కొన్నారు.  ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భవన నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు అనుభవించక తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు.


పోలవరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: సుజనా
22-08-2019 19:30:07

అమరావతి: పోలవరంపై రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్వాగతించారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందని చెప్పారు. ఈ తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిస్తున్నామన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి ఉంటే బాగుండేదని సూచించారు. సాక్షాత్తూ జపాన్ ప్రభుత్వం సైతం ఈ ప్రభుత్వ చర్యలు అభివృద్దికి దోహదపడవని లేఖ రాసిందని గుర్తుచేశారు. అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. వ్యక్తిగత అహంభావాలకు, పంతాలకు పోకుండా పోలవరం సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదు: అనిల్‌
22-08-2019 17:43:30

విజయవాడ: హడావుడిగా రూ.220 కోట్ల టెండర్లు వేశారని మంత్రి అనిల్‌ ఆరోపించారు. హడ్కో నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్ల ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అన్ని వర్గాలవారికీ భవన నిర్మాణ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదని ఆయన చెప్పారు. రివర్స్ టెండర్లకు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకంత భయమని ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వం అన్ని విషయాల్లో అవినీతికి పాల్పడిందని, మంత్రి బొత్స సత్యనారాయణ కేవలం శివరామకృష్ణ కమిటీ నివేదికనే గుర్తు చేశారని అనిల్ పేర్కొన్నారు.

పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టేనే ఇచ్చింది: కొడాలి నాని
22-08-2019 17:36:52

అమరావతి: పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని మంత్రి కొడాలి నాని అన్నారు. అంతేకాని చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదన్నారు. కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దనేదే జగన్‌ లక్ష్యమని వెల్లడించారు. మంత్రి బొత్స వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశాం.. దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.