Tuesday 20 September 2022

Polavaram RR Package

 Published: Tue, 20 Sep 2022 03:13:03 ISTహోంఆంధ్రప్రదేశ్పోలవరంపై నిండు సభలో బొంకులు!twitter-iconwatsapp-iconfb-iconపోలవరంపై నిండు సభలో బొంకులు!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750అబద్ధాల సీరియల్‌ 3.0

నిర్వాసితులకిచ్చిన మాట మార్చేశారునిర్వాసితులందరికీ 10 లక్షలిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ వాగ్దానంఇప్పుడు సభలో నాలుక మడత

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితులకు భూపరిహారం చెల్లింపులో నిండు సభలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు బొంకులతో బుకాయింపులకు దిగారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎకరాకు ఇస్తున్న రూ.6.5 లక్షలు చాలడం లేదని.. తాను అధికారంలోకి వస్తే రూ.పది లక్షల చొప్పున ఇస్తానని ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. 2021 జూన్‌ 30వ తేదీన పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపుపై ఉత్తర్వు జారీ చేశారు. అయినా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇచ్చిన మాట మేరకు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ఎకరాకు పది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రతిపక్షం అసెంబ్లీలో డిమాండ్‌ చేసింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభలో దీనిపై చర్చ జరిగింది. ఎకరాకు పది లక్షల రూపాయలిస్తామని జగన్‌ ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి అంబటి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్పష్టం చేశారు.

అయితే సీఎం జోక్యం చేసుకుని.. పది లక్షల పరిహారంపై తాను హామీ ఇచ్చానని.. ఆమేరకు 2021 జూన్‌ 30వ తేదీన జీవో ఇచ్చానని చెప్పారు. గతంలో ఏం మాట ఇచ్చామో దానికి కట్టుబడి ఉన్నామన్నారు. డ్యాం పూర్తయ్యాక మొదట డ్యాం భద్రత దృష్ట్యా నీటిని 41.15 మీటర్ల కాంటూరులో నిల్వ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు గాను 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 20,946 కుటుంబాలు వస్తాయని.. మిగిలిన 85,060 కుటుంబాలు 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోకి వస్తాయని తెలిపారు. వీరిలో 41.15 మీటర్ల కాంటూరు లెవల్‌కు వచ్చే 14,110 కుటుంబాల పునరావాసం రూ.1,960.95 కోట్లతో పూర్తయుందని వెల్లడించారు. ‘ 2019 నుంచి ఇప్పటి వరకూ 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1,773 కోట్లు ఖర్చు చేశాం. 41.15 కాంటూరు వరకూ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుంబాలను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తాం. ఈ 6,836 కుటుంబాలకు ఎకరాకు పది లక్షల చొప్పున చెల్లించేందుకు రూ.500 కోట్లు మాత్రమే ఖర్చవుతాయి. వీటిని చెల్లిస్తాం’ అని వెల్లడించారు. ఎకరాకు లక్షన్నర చొప్పున చెల్లించిన వారికి మరో మూడున్నర లక్షలు చెల్లిస్తామని జగన్‌ చెప్పారు.

వారికి మొండిచేయే! ముఖ్యమంత్రి ప్రసంగాన్ని పరిశీలిస్తే.. కేవలం 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని 20,946 కుటుంబాలకు మాత్రమే ఎకరాకు రూ.పది లక్షలు ఇస్తాయన్న మాట. 45.72 మీటర్ల కాంటరు పరిధిలోని వచ్చే మిగతా 85,060 కుటుంబాలను గాలికి వదిలేసినట్లే! వారికి పది లక్షలు ఇవ్వబోవడం లేదని చెప్పకనే చెప్పేశారు. తమకు రూ.6.5 లక్షలే వస్తున్నాయని.. అని చాలడం లేదని నిర్వాసితులు చెప్పారని.. దాంతో వారు పరిహార దీక్ష చేస్తున్నప్పుడు తాను అధికారంలోకి వస్తే ఎకరాకు పది లక్షలిస్తానని చెప్పానని.. ఇప్పుడు ఎన్నికల సభలోనూ అదే హామీ ఇస్తున్నానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ స్పష్టం చేశారు. అయితే పరిహార దీక్షలో గానీ.. ఎన్నికల ప్రచారంలో గానీ ఎక్కడా 41.15 మీటర్లకే పరిమితమవుతామని ఆయన చెప్పలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. 41.15 మీటర్ల కాంటూరుకే అంటే.. 20,946 కుటుంబాలకే ఎకరాకు పది లక్షలు చెల్లిస్తామని ఆయ న చెప్పడం విస్తుగొల్పుతోంది. జగన్‌ మరోసారి మాటమార్చా రని.. మడమ తిప్పేశారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Tuesday 15 February 2022

నదుల అనుసంధానం డేంజర్‌ - రాజేంద్రసింగ్‌

 నదుల అనుసంధానం డేంజర్‌

నీళ్లపై, నదులపై రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే ఆ పథకం ఉద్దేశం

VDO.AI

నీటి ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణే  దాని లక్ష్యం.. నదుల పునరుజ్జీవనం జరగాలివాటితో ప్రజల్ని అనుసంధానించాలి.. వాణిజ్య పంటలతోనే కావేరిలో నీటి కొరతతెలంగాణలో వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌అదే జరిగితే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది

‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం దేశానికి మంచిది కాదని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె పురస్కార గ్రహీత రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. రాష్ట్రాలకు నీళ్లపై, నదులపై ఉన్న హక్కులను లాక్కొని బడా వర్గాలకు కట్టబెట్టడానికే నదుల అనుసంధానం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నదులపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో వివరాలు వెల్లడించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. 

ఆంధ్రజ్యోతి: ఏటా గోదావరిలో మూడువేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కావేరిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు నదుల అనుసంధానం పరిష్కారం కాదా?రాజేంద్రసింగ్‌: కాదు. ఎందుకంటే నదుల అనుసంధానమే తప్పు. నదుల అనుసంధానం పేరిట పనులు చేపడితే ఇదివరకే ఉన్న నదులన్నీ దెబ్బతింటాయి. నదులపై, నీళ్లపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కాలరాయడమే ఆ పథకం లక్ష్యం. నదులపై హక్కులను బడాబాబులకు అప్పగించాలనే కుట్ర నదుల అనుసంధానంలో ఉంది. నదుల సహజత్వం ఈ పథకం వల్ల దెబ్బతింటుంది. ఎక్కడికక్కడ నీటి వనరులను కాపాడుకుంటూనే భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక కావేరీలో నీటి కొరతకు ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న వాణిజ్య పంటలే. ఒక టీఎంసీ నీటితో తెలంగాణలో 12 వేల ఎకరాలు సాగవుతుండగా... కావేరీ పరివాహక ప్రాంతంలో ఒక టీఎంసీతో మూడువేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పంటలు పండిస్తున్నారు.  

నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో మీరు కూడా సభ్యులే కదా?ఒకప్పుడు నేను కూడా ఆ కమిటీలో సభ్యుణ్ని. అయితే నాకిచ్చిన పత్రాలన్నీ తీసి... పక్కన పడేశా. నదుల అనుసంధానం వద్దని తొలి నుంచి వాదిస్తూనే ఉన్నా. నీటిని ప్రైవేటీకరించి, వ్యాపారం చేయాలనే లక్ష్యాలు నదుల అనుసంధానం వెనుక ఉన్నాయి. నదుల అనుసంధానంతో సామాజిక, ఆర్థిక, సాంస్కతిక అంతరాలు ఏర్పడి, దేశం సంక్షోభంలోకి వెళుతుంది. నీటి ప్రైవేటీకరణలో భాగమే ఈ పథకం. నదుల అనుసంధానం కాదు. నదులతో ప్రజలను అనుసంధానించాలి.  నదుల అనుసంధానం లేకపోతే కరువు ప్రాంతాల్లో అభివృద్ధి ఎట్లా?నీళ్లు అవసరమే.. కానీ అత్యాశ పనికిరాదు. గంగా మాయీ (గంగమ్మ) కమాయి (ఆదాయం) కారాదు. గంగానది 11 రాష్ట్రాలు, పలు దేశాల్లో ప్రవహిస్తుంది. గంగానది అనుసంధానం ప్రతిపాదించినా జరగలేదు. రాజస్థాన్‌లో తక్కువ వర్షపాతం ఉంది. ఆ రాష్ట్రంలో 12 నదుల పునరుజ్జీవనం చేశాం. ఆ పని దేశమంతా జరగాలి. స్థానికంగా ఉన్న నదుల పునరుజ్జీవనం జరగాలి. వాణిజ్య పంటల సాగు కూడా నీటి సంక్షోభానికి కారణం. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి.  

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే గెజిట్‌పై మీ అభిప్రాయమేంటి?రివర్‌ బేసిన్‌ అథారిటీ బిల్లు, డ్యామ్‌ సేఫ్టీ బిల్లులు సిద్ధమైనప్పుడే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను కలిసి, నదులు, చెరువులపై హక్కులను కేంద్రం లాక్కునే కుట్రను వివరించా. అయినా ఒక్క సీఎం కూడా స్పందించలేదు. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రం నేతృత్వంలోని బోర్డులకు అప్పగిస్తూ గెజిట్‌ జారీ అయింది. నదులపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాలరాయడంలో భాగంగా వేసిన తొలి అడుగే ఇది. 

తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై?సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం. గోదావరి నదిని 200 కిలోమీటర్ల మేర పునరుజ్జీవనం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆనందం కలిగింది. హరితహారం కార్యక్రమంతో పాటు ఇంటింటికీ నీరిచ్చే మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ, ఆరుతడి పంటల సాగుకు తెలంగాణ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. మనిషిని, నీళ్లను జోడించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా వాటర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వాటర్‌ యూనివర్సిటీ లేదు. నీటి అవసరం, ప్రాధాన్యాన్ని భావితరాలకు అందించేలా పరిశోధనలు జరగాలి.

27 నుంచి నదులపై జాతీయ సదస్సు హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదులపై ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ తెలిపారు. భారతీయ ద్వీపకల్ప నదీ పరివాహక మండలి, భారతీయ హిమాలయ నదీ పరివాహక మండలి  సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో తెలంగాణ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్‌ సంస్థలు పాల్గొననున్నాయని ఆయన వెల్లడించారు. మంగళవారం జలసౌధలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏడేళ్లుగా జల వనరులపై కీలక పనులు జరుగుతున్నాయని, 200 కిలోమీటర్ల మేర గోదావరి నది పునరుజ్జీవనం జరిగిందని చెప్పారు. కాగా గెజిట్‌తో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గెజిట్‌ను వ్యతిరేకించాల్సిందేనని ఆయన అన్నారు. 

Wednesday 14 July 2021

Srisailam Reservoir - Kalvakurti, SLBC & Rayalaseem LIS

 1. శ్రీశైలం  800 అడుగుల నీటిమట్టం 

కల్వకుర్తి ఎత్తిపోతల,   పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల 


2. శ్రీశైలం  824 అడుగుల నీటిమట్టం SLBC


3.  శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులు


4.  శ్రీశైలం  854 అడుగుల నీటిమట్టం

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ / రాయలసీమ ఎత్తిపోతల పథ



టిడిపి వివాదం 


ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ కోసం నడుంబిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సమాజంపై ఉన్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతూనే ఉన్నది. ఈ పూర్వరంగంలో "రామాయణంలో పిడకలవేట" అన్నట్లు టిడిపి శాసనసభ్యుల లేఖాస్త్రం ఉన్నది. పైపెచ్చు, దాన్నొక ఆందోళనాంశంగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 


ప్రకాశం జిల్లా నీటి కష్టాలు వర్ణనాతీతం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు, ప్రత్యేకించి చివరి ఆయకట్టు భూములకు నీళ్ళు సక్రంగా అందడం లేదు. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టాలో ఉన్న చివరి ఆయకట్టు భూములకు నీళ్ళు అందడం లేదు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కరవు పీడిత ప్రాంతాల నీటి కష్టాలు తొలగిపోతాయని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో క్షమించరాని జాప్యం జరుగుతున్నది.


2004లో అనుకొంటాను, సిపిఐ, ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్కాపురం సమీపంలో ఉన్న వెలుగొండ శంకుస్థాపన స్థూపం వద్ద నుండి ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్రలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, నిథులు కేటాయించకుండా, నిర్మాణ పనులు ప్రారంభించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే లక్ష్యంతో నాడు పాదయాత్ర చేశాం.


రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రకాశం జిల్లాకు నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు టిడిపి శాసన సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసిన ఉత్తరంపై నా స్పందనను సీనియర్ పాత్రికేయ మిత్రులు, రాజకీయ విశ్లేషకులు విక్రం పూలా గారు కోరారు. విక్రం గారికి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాధానం పంపాను. అలాగే, కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం తెరలేపిన వివాదంపై జరుగుతున్న చర్చలో భాగంగా వివిధ టీవీల్లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలను, నా ఇంటర్యూల  వీడియోలను యూట్యూబ్ ఛానల్స్  ద్వారా వీక్షించిన కొందరు మిత్రులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు నీటి కష్టాలను జోడించి సానుకూల స్పందనలు తెలియజేశారు. వాటిపై స్పందించడం అవసరమని, కాస్త వివరంగా వ్రాయాలని భావించాను.


శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటిమట్టం నుండి నీటిని తరలించడానికి వీలుగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల మరియు  పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల (కొత్తది) పథకాలు, 824 అడుగుల నీటిమట్టం నుండి సొరంగ మార్గంలో నీటిని తరలించడానికి వీలుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి.) ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి. వాటివల్లలేని ప్రమాదం రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలా ముంచుకొస్తున్నదో! రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ వ్రాసిన ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి శాసనసభ్యులు వివరిస్తే తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉన్నది.


నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ క్రింద ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు నీటి సరఫరా సక్రమంగాలేని మాట ముమ్మాటికీ నిజం. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబునల్ 281 టియంసిల నికరజలాలను కేటాయించింది. అందులో 132 టియంసిలు కుడి కాలువకు కేటాయించబడ్డాయి.


బచావత్ ట్రిబునల్ కేటాయింపులకు అనుగుణంగా నికర జలాలను మరియు వినియోగ స్వేచ్ఛ కల్పించిన మిగులు జలాలను శ్రీశైలం జలాశయం నుండి  వినియోగించుకోవడానికి వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 15న  జీ.ఓ.యం.ఎస్.నెం.69ను జారీ చేసింది. అందులో నీటి వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రాధాన్యతాక్రమంలో విస్పష్టంగా పేర్కొన్నారు.


1.మద్రాసుకు త్రాగునీరు, 2. హైదరాబాదుకు త్రాగునీరు, 3. కృష్ణా డెల్టాకు సాగునీరు, 4. నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు, 5. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు నీరు, 6. తెలుగు గంగ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు నీటిని విడుదల చేయాలని ఆ జీ.ఓ.లో పేర్కొనబడి ఉన్నది. దాన్ని అమలు చేయమని అడగడం న్యాయం. అది అడగకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రకాశం జిల్లాకు నష్టమని అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్లు!


శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.)కి 19 టియంసిల నికరజలాలు, చెన్నయ్ నగరానికి 15 టియంసిలు త్రాగునీరు, తెలుగు గంగకు 29 టియంసిలు(బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 టియంసిల మిగులు జలాలను కేటాయించింది), గాలేరు-నగరి పథకానికి 38 టియంసిలు, కె.సి.కెనాల్ కు 10 టియంసిలు, రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటికి 3 టియంసిలు, మొత్తం 114 టియంసిలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నదీ జలాలు సరఫరా కావాలి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించాలని జీ.ఓ.నెం.69లో పేర్కొన్నారు. 


కర్నాటకలో ఆల్మట్టి డ్యాం నిర్మించి, ప్రస్తుతానికి 519 అడుగుల ఎత్తుకు పరిమితం చేసి నీటిని వాడుకొంటున్నా, శ్రీశైలంకు వరద ప్రవాహం తగ్గిపోయింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256  మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతిస్తూ తీర్పులో పేర్కొన్నది. అది అమలులోకి వస్తే పరిస్థితి మరింతదారుణంగా ఉంటుందని తీవ్ర ఆందోళన చెందుతున్నాం.


 రాష్ట్ర విభజనతో ఎగువ రాష్ట్రంగా మారిన తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రశ్నార్థకమవుతాయి. నిర్మాణంలో ఉన్న వాటితో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ప్రకటించిన ప్రతిపాదిత పథకాలన్నింటి ద్వారా దాదాపు 400 టియంసిల మిగులు జలాలను వినియోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్టులను నిర్మించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పథకం రచిస్తున్నది.


 శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులుగా జీ.ఓ.నెం.69లో పేర్కొన్నారు. అంతకంటే క్రింద నుండి త్రాగునీటికి తప్ప నీటిని వినియోగించకూడదు. కానీ, 800 అడుగుల నుండి కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, 824 అడుగుల వద్ద నుండి ఎస్.ఎల్.బి.సి. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన మీదట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని సరఫరా చేయడానికి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టంపైన ఎన్ని రోజులు నీటి నిల్వ ఉంటుందో విజ్ఞతతో ఆలోచించాలి.


ఈ పూర్వరంగంలో ఒకటే పరిష్కారం. జీ.ఓ.నెం.69లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి శ్రీశైలం జలాశయం నుండి నీటిని వినియోగించుకోవాలి. మిగులు జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టంపైన నీటి నిల్వ ఉన్నప్పుడే నీటిని విడుదల చేయాలి. ఆ నిబంధనను విధిగా అమలు చేస్తే అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే ఉండదు.  


ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ, నిత్య కరవు పీడిత ప్రాంతాలను నీటి కష్టాల నుండి శాశ్వతంగా విముక్తి చేసే రాజకీయ సంకల్పంతో, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ సమాజం ఐక్యంగా నిలబడి, పోరుసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


టి.లక్ష్మీనారాయణ

కన్వీనర్,

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Monday 5 July 2021

Srisailam Hydel power project - Telangana ENC C Muralidhar

 జల విద్యుత్తు కోసమే శ్రీశైలం!

5 July 2021

ఆ ప్రాజెక్టు కట్టిందే అందుకు..

ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణలు నిరాధారం

నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టును కట్టిందే జల విద్యుత్తు కోసమని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 1959లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది. ఈ ప్రాజెక్టులోని నీటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ లేఖ రాశారు. జూన్‌ 17నఏపీ ఫిర్యాదుకు  కేఆర్‌ఎంబీ స్పందించి తెలంగాణకు లేఖ రాయడంతో, దానికి ఈఎన్‌సీ ఈ మేరకు జవాబు ఇచ్చారు. లేఖలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్వాపరాలను వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమే నీటిని వినియోగించుకుంటున్నామని, ఏపీ అభ్యంతరాలు సరి కాద ని పేర్కొన్నారు.


లేఖలోని వివరాలు ఇవీ..

శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్తు కోసమే నిర్మించారని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1లోని 104వ పేజీలో కూడా ఉంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా శ్రీశైలం నీటిని ఇతర బేసిన్‌ లోకి తరలించలేదు. 1990-91 నుంచి 2019-20 దాకా ఏ నెలలోనూ 834 అడుగుల పైన శ్రీశైలం నీటిని నిల్వ చేసిన దాఖలాలు లేవు. 

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచి.. ఆ నీటిని ఇతర బేసిన్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తోంది. 2013 దాకా శ్రీశైలం లో 760 అడుగులకు చేరే వరకు కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని తరలించారు.

ఏపీ ప్రభుత్వానికి సాగర్‌, కృష్ణా డెల్టాల ప్రయోజనాలు అక్కర్లేదు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పునకు విరుద్ధంగా ఈ నీటిని ఇతర బేసిన్‌ లకు తరలించే యత్నాలు చేస్తోంది. దీంతో సాగర్‌ పై ఆధారపడిన ప్రజలకు తీవ్ర నష్టం కలగనుంది.

2015 జూన్‌లో త్రిసభ్య కమిటీ సమావేశంతో పాటు బోర్డు 5, 7, 8, 12వ సమావేశాల్లో శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి కోసం జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకారం కుదిరింది. దీనిప్రకారమే జల విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌ ప్రాజెక్టు అవసరాలు తీర్చుతున్నాం. 

జతెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను, ప్రధానం గా బేసిన్‌ అవతలి అవసరాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు శ్రీశైలంలో 880 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే జలాలను తరలించాల్సి ఉం ది. శ్రీశైలం నికర జలాలను మిగులు జలాలపై కట్టి న ప్రాజెక్టులకు తరలించి, నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టాలకు నీటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

1976, 77ల్లో మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 15 టీఎంసీల కృష్ణా జలాలను చెన్నై తాగునీటి అవసరాలకు జూలై-అక్టోబరు మధ్య రోజుకు 1,500 క్యూసెక్కులకు మించి తరలించడానికి వీల్లేదు. 

శ్రీశైలం కుడికాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారం కూడా చెన్నై తాగునీటి అవ సరాలకు 1,500 క్యూసెక్కులు, కుడికాలువకు 750 టీఎంసీ లు మాత్రమే తరలించాల్సి ఉంది. అది కూడా శ్రీశైలంలో 854 అడుగుల పైన ఉంటేనే తరలించాలి.

2019-20లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 170 టీఎంసీల నీటిని, 2020-21లో 124 టీఎంసీలను తరలించింది. అయితే 10 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటికి ఇవ్వలేకపోయామని చెప్పడం సరికాదు. పెన్నా బేసిన్‌లో 360 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు కట్టుకున్నారు. 

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గతేడాది 5 టీఎంసీలు తరలించారు. 

తెలంగాణ విద్యుదుత్పత్తి వల్ల ఏపీలో తాగునీటి కొరత అనే వాదనలో నిజం లేదు. కృష్ణా బేసిన్‌లో 629 టీఎంసీల నీటిని తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 12వ షెడ్యూల్‌లో సెక్షన్‌-1 ప్రకారం విద్యుత్కేంద్రాలు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పును అనుసరించి సాగర్‌లో నీటి నిల్వలను పెంచడానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. దీనిపై ఏపీ ఆరోపణలు నిరాధారం

Rayalaseema Lift Irrigation is illegal - Telangana

 రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ముమ్మూటికీ అక్రమమే

3-7-2021

 హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ముమ్మూటికీ అక్రమమేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కేసీఆర్ మాట్లాడుతూ  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టుగా ఏపీ గుర్తించడం లేదన్నారు. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అక్రమమేనని ఆయన అన్నారు.


 ఈ నెల 9న నిర్వహించే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారు. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ కోరారు. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలన్నారు. కృష్ణా బోర్డు సమావేశంలో తమ వాదన వినిపిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. జలవిద్యుత్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. కృష్ణా జలాలు సముద్రంలోకి వృథా చేస్తున్నారనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటినే శ్రీశైలం ప్రాజెక్టులో వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. శ్రీశైలం డ్యాం దగ్గరికి ప్రాజెక్టు ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని కేసీఆర్ పేర్కొన్నారు. 

New politics around Krishna Waters

 నీళ్ల చుట్టూ నయా రాజకీయం!

Jul 4 2021 


చెట్టుఎక్కుదామంటే ఆకులు అడ్డొస్తున్నాయని వెనుకటికి ఎవడో అన్నాడట! కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పటికీ... హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించవలసి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఇలాగే ఉంది. జగన్‌ రెడ్డి పుట్టక ముందు నుంచే సీమాంధ్రులు తెలంగాణలో ఉంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా వారికెవరూ ఎటువంటి అపకారమూ చేయలేదు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు వచ్చిన కష్టం కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆంధ్రాలో ఉంటున్న వారి కంటే తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులే ఎక్కువగా అభివృద్ధి చెందారు. తమ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణలో ఫిర్యాదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇందుకు విరుద్ధంగా కంపెనీలను, సంస్థలను గుంజుకుని అస్మదీయులకు కట్టబెడుతున్నారు. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోపై అధికార పార్టీ పెద్దలు కన్నేశారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలజగడంపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యతిరేకించే దమ్ము, ధైర్యం లేని జగన్‌ అండ్‌ కో ఇప్పుడు హైదరాబాద్‌లోని సీమాంధ్రులను రక్షణ కవచంగా వాడుకోవాలని చూడటం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిన జగన్‌ రెడ్డి, తాను అగ్రజుడిగా భావిస్తున్న కేసీఆర్‌కు మాత్రం ఫోన్‌ చేసే సాహసం చేయలేదు. తాను సంయమనం కోల్పోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఏమవుతుందోనని ఇప్పుడు ఆందోళన పడుతున్న జగన్‌ రెడ్డి, 2016లో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. అప్పుడు జగన్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివసించేవారు. అప్పటికి తాడేపల్లికి మకాం మార్చలేదు. అయినా తాము చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన జగన్‌ రెడ్డికి నష్టం చేయడానికి తెలంగాణవాదులు ప్రయత్నించిందేమీ లేదు. అప్పట్లో ఓటుకు నోటు కేసుకు భయపడి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదని జగన్‌ అండ్‌ కో నిందించారు. అవన్నీ గుర్తున్నవాళ్లు హైదరాబాద్‌లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికే జగన్‌ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఇప్పుడు నిందిస్తున్నారు. ఇంతకూ కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండిగా వ్యవహరిస్తున్నదా? లేక రాయలసీమకు నీటిని తరలించడం కోసమే ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నదా? ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉంటాయి కనుక నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పరిస్థితి సహజంగానే పైచేయిగా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ మధ్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల మధ్య జల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజల ప్రయోజనాలు పక్కకు జరిగి రాజకీయ ప్రయోజనాలు చొరబడతాయి. ఇప్పుడు ఆంధ్రా–తెలంగాణ మధ్య జరుగుతున్నది ఇదే! 



PauseUnmute

Fullscreen

VDO.AI



ఆనాడే మేల్కొని ఉంటే...


పులిచింతల ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం అన్యాయం అని, దీనివల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్నాయని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి ఏర్పడటానికి సీమాంధ్రకు చెందిన నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడమే కారణం. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. వరదలొచ్చినప్పుడు నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేసే నీటి నుంచి 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్‌ చేశారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తొలుత ఎన్టీఆర్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. పులిచింతలకు కుడివైపున విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు. అప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రాంతం ముంపునకు గురవుతుందంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత విద్యుత్‌కేంద్రాన్ని ఎడమవైపున నిర్మించాలని వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచన చేసింది. దీంతో పులిచింతల ఎడమ వైపున, అంటే తెలంగాణ భూభాగంలో విద్యుత్‌ కేంద్రం నిర్మితమైంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణానదికి కుడి వైపున ఉన్న విద్యుత్‌కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ వైపున ఉన్నవాటిని తెలంగాణకు పంచారు. ఈ కారణంగానే పులిచింతల వద్ద విద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారం, వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి లభించాయి. పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందినప్పటికీ విద్యుత్‌కేంద్రం మాత్రం తెలంగాణకు దక్కింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణవాదులు తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టగా, సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమని అప్పుడే గుర్తించి, తమ భూభాగంలో నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టులో భాగమైన విద్యుత్‌ కేంద్రాన్ని కూడా తమకే కేటాయించాలని పట్టుబట్టి ఉంటే దక్కి ఉండేదేమో! అంటే నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ విద్యుత్‌కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏడిస్తే ఏం ప్రయోజనం? తమకు దక్కిన విద్యుత్‌కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకు ఉండదా? ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోకి వచ్చే కుడివైపున ఆనాడే విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించినా ప్రస్తుత పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఈ విషయం అలా ఉంచితే, పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల కృష్ణాజిల్లాకు సాగునీటి సమస్య తీరిపోయింది. కృష్ణాజలాల కోసం వేచిచూడకుండా రైతులు సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. వేసవిలో మంచినీటి కొరత ఏర్పడినప్పుడు మాత్రమే పులిచింతల ఉపయోగపడుతోంది. ఈ సీజన్‌లో వరదలు రాని పక్షంలో పులిచింతల ఖాళీ అయిపోతుంది. అప్పుడు మంచినీటి కొరత ఏర్పడినా నీళ్లు ఉండవు. అయితే కాళేశ్వరం నుంచి వర్షాకాలంలోనే నీటిని ఎత్తిపోస్తున్నారు కనుక విద్యుత్‌ అవసరం తెలంగాణకు ఎక్కువగా ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎవరిని తప్పుబట్టాలి?




రాజకీయమే పరమావధి!


హైదరాబాద్‌లోని సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవడానికి జగన్‌ రెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆహ్వానించిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చిన జగన్‌ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలియడం లేదు. ప్రధానికి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీ చూసి స్పందించేలోపు పులిచింతల ఖాళీ అవుతుంది. పులిచింతలలో నిల్వ ఉన్న నీరు ఎండాకాలం అవసరాలకు కావలసి ఉంటుందని జగన్‌ రెడ్డి భావించే పక్షంలో కేసీఆర్‌కు ఫోన్‌ చేసో, లేక వ్యక్తిగతంగా కలిసో... ‘మీకు విద్యుత్‌ కావాలనుకుంటే పులిచింతలలో ఎంత ఉత్పత్తి చేస్తున్నారో అంత విద్యుత్‌ను శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి చేసి ఇస్తాం. నీళ్లను మాత్రం వృథా చేయవద్దు’ అని కోరవచ్చు కదా! ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా తెలంగాణ మంత్రులు నోరు జారడం, ఆంధ్రా ప్రాంత మంత్రులు లేస్తే మనుషులం కాదన్నట్టుగా ఉత్తుత్తి హెచ్చరికలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల సమస్యలను కూడా జటిలం చేస్తూ రాజకీయ అవసరాల కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇరువైపులా జరుగుతోంది. రాయలసీమకు మేలు చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే కేసీఆర్‌ అండ్‌ కో ఇబ్బందులు సృష్టిస్తున్నారని సీమప్రజలు భావించాలని జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఉంది. తెలంగాణకు చెందిన నీటిని జగన్‌ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తరలిస్తూ ఉంటే తాను పోరాడుతున్నానని తెలంగాణ ప్రజలు భావించాలని కేసీఆర్‌ కోరుకుంటున్నట్టుగా ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరిగే వరకు ఇదే తంతు కొనసాగవచ్చు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి అవసరం ఇంకా ఉందని ప్రజలు భావించేలా కేసీఆర్‌ ఎత్తుగడలు ఉన్నాయి. అనుమతులు, నిధుల కేటాయింపులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూపెట్టి సీమప్రజల మనసు చూరగొనవచ్చునన్నది జగన్‌ రెడ్డి కోరిక కావచ్చు. మొత్తానికి ఇద్దరికీ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి కనుక ప్రస్తుత ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా పులిచింతలను ఖాళీ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందంటే అది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకే. వచ్చే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడితే ఇబ్బంది పడేది వారే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ రెడ్డి బలహీనతలు, బేలతనం బయటపడుతున్నాయి. నిన్నటిదాకా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని బీరాలు పలికి ఇప్పుడు ‘మనం చేయగలింది ఏమీ లేదు’ అని చేతులెత్తేశారు. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా తన వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌కు లొంగిపోక తప్పని పరిస్థితి జగన్‌ రెడ్డికి ఏర్పడింది. అంతేనా, ఎన్నికల సమయంలో కేసీఆర్‌ పలు రూపాల్లో చేసిన సహాయాన్ని మర్చిపోయి రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడగలరు? అందుకే హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను బూచిగా చూపిస్తున్నారు. సర్వ అనర్థాలకూ చంద్రబాబు నాయుడే కారణం అని చెబుతూ వస్తున్న జగన్‌ అండ్‌ కోకు ప్రస్తుత వివాదానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పవచ్చునన్న ఆలోచన ఎందుకు రాలేదో!? పొరుగు రాష్ర్టాలతో, ముఖ్యంగా తెలంగాణతో సఖ్యతగా ఉండాలని తరచుగా చెప్పే జగన్‌ రెడ్డి.. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానికి ఫిర్యాదు చేయడం ద్వారా చేతులు దులుపుకొన్నారు. రాయలసీమను కూడా కోనసీమగా చూడాలని ఉందని ఏడాదిన్నర క్రితం గొప్పగా చెప్పి ఔదార్యాన్ని చాటుకోవడమే కాకుండా నగరిలో ఉండే ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ప్రస్తుత వివాదానికి తెర తీశారు. జగన్‌ రెడ్డి కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలో ఉన్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధపులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి గాండ్రించేవి. ఇప్పుడు తమవాడే అధికారంలో ఉన్నందున వారికి రాయలసీమలో ఎనలేని అభివృద్ధి కనిపిస్తూ ఉండవచ్చు. సీమాంధ్ర నాయకుల గురించి కేసీఆర్‌కు బాగానే తెలుసు కనుక ఆయన ఇలాగే ముందుకు వెళుతూ ఉంటారు. నిజానికి ఈ నీళ్ల జగడం వెనుక ఇంకేదో మతలబు కూడా ఉంది. తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల సొంత పార్టీ పెట్టుకోవడంపై కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారట. సోదరిని కట్టడి చేయలేకపోతున్న జగన్‌ రెడ్డిపై ఆయన మండిపడుతున్నారట. ఈ వ్యవహారంలో జరగబోయేది ఏమిటి? జరిగింది ఏమిటి? అన్నది వచ్చే వారం చెప్పుకొందాం!




పంథా మార్చుకునే ప్రసక్తే లేదు!


గత వారం నేను వెల్లడించిన కొన్ని అంశాలపై నీలిమీడియాలో భాగంగా ఉంటున్న జగన్‌ రెడ్డి భక్తులు గుండెలు బాదుకున్నారు. జగన్‌బాబును బాధపెడతారా? ఇదేమి జర్నలిజం అంటూ చిందులు తొక్కారు. మంత్రి కొడాలి నాని యథావిధిగా బూతులు తిట్టారు. ‘ఆంధ్రజ్యోతి’కి, ‘ఏబీఎన్‌’కూ విశ్వసనీయత లేదని నోరు పారేసుకున్నారు. జగన్‌ రెడ్డి–షర్మిల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయని, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను బహిర్గతం చేసినప్పుడు కూడా ఇలాగే నిందించారు. అప్పుడు నేను చెప్పిందే నిజమైంది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. కరోనా గురించి భయపడాల్సింది లేదని ఏసు ప్రభువు తనకు చెప్పారని జగన్‌ రెడ్డి అధికారులతో ఎప్పుడు అన్నదీ తేదీతో సహా గత వారం నేను వెల్లడించాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తూ ఆ సమయంలో అక్కడే ఉన్న అధికారి ద్వారా సదరు విషయం నాకు తెలిసిందని కూడా చెప్పాను. మాజీ ఐఏఎస్‌ అధికారి చెప్పారు అని అంటే, ఆ అధికారి ఎవరో బయటపెట్టాలని సవాలు విసిరారు. సమాచారం అందించే వారి పేర్లను జర్నలిస్టులు వెల్లడించాల్సిన అవసరం లేదని నన్ను విమర్శించిన వారికి తెలియకపోవడం విషాదం! ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఏం జరిగినా అదంతా దేవుడు రాసిన స్ర్కిప్టు ప్రకారమే జరుగుతోందని నమ్మే వ్యక్తి జగన్‌ రెడ్డి. అలాంటప్పుడు అదే దేవుడు ఐఏఎస్‌ అధికారితో ఆ సమాచారాన్ని నాకు చెప్పించి ఉంటారని భావించకుండా నీలిమూకను ఉసిగొల్పడం ఎందుకో? దారిన పోయే దానయ్య చెబితే రాస్తారా? అంటూ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొందరు వ్యాఖ్యలు చేశారు. కాలమిస్టులు సమాచారం ఎలా సేకరిస్తారో ఇలాంటి వాళ్లు మరచిపోయి ఉంటారు. తాము అమితంగా ప్రేమించే జగన్‌ రెడ్డికి నష్టం జరుగుతుందని భావించే వాళ్లు బాధపడడంలో, నన్ను విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. నేను జర్నలిజంలోకి ప్రవేశించిన కొత్తలో ‘హిందూ’ బ్యూరో చీఫ్‌గా రాజేంద్రప్రసాద్‌, ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు సుందరం, ‘దక్కన్‌ క్రానికల్‌’కు రవీంద్రనాథ్‌, ‘ఈనాడు’కు ఎస్‌.ఎన్‌.శాస్ర్తి, ‘ఆంధ్రజ్యోతి’కి ఐ.వెంకట్రావ్‌, ‘ఆంధ్రపత్రిక’కు పాపయ్యశాస్ర్తి బ్యూరో చీఫ్‌లుగా ఉండేవారు. వీరంతా ప్రతి వారం తమ పేరిట కాలమ్స్‌ రాసేవారు. ఆ వారంలో జరిగిన పరిణామాలకు తాము సేకరించిన సమాచారాన్ని జోడించి కాలమ్స్‌ రాసేవారు. ఆనాడు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు సైతం రాజకీయాల్లో ఏం జరుగుతోంది, సొంత పార్టీలోని తమ ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏమిటి అనేవి తెలుసుకోవడానికి సదరు కాలమ్స్‌ పైనే ఆధారపడేవారు. అప్పుడు నీకా సమాచారం చెప్పింది ఎవరు? అని వారెవరూ అడిగేవారు కాదు. కాలమిస్టులు రాసిన దాంట్లో నుంచి తెలుసుకోవలసిన సమాచారాన్ని తీసుకునేవారు. ఇప్పుడు వారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిసినవాళ్లు కూడా ఎవరో ఐఏఎస్‌ అధికారి చెబితే మాత్రం రాసేయడమేనా? అని తెగ బాధపడిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. మీడియాలో ఉండే వారికి వివిధ మార్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది. మనకుండే పరిచయాలను బట్టి రహస్య సమాచారం కూడా అందుతూ ఉంటుంది. జాతీయ మీడియాలో కూడా ఇలాగే సమాచారం వస్తుంది. నాకు సమాచారం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారిని దారిన పోయే దానయ్య అని నిందించే వాళ్లను చూసి జాలిపడాల్సిందే. ఏ కాలమిస్ట్‌కు అయినా వారికి ఉండే విశ్వసనీయతను బట్టి సమాచారం అందిస్తారు. నీకు మాత్రమే ఎందుకు చెప్పారు అంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. జగన్‌ రెడ్డిని విమర్శించడమే మహాపాపం అన్నట్టుగా నీలిమీడియాలో భాగమైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు మేలు చేయడం కోసమే జగన్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారని విమర్శించడం ఫ్యాషన్‌ అయింది. తప్పుడు వార్తలు రాస్తే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు పెట్టమని ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి ఆదేశించడమే కాకుండా జీవో కూడా జారీ చేశారు కదా! మేం నిజంగా తప్పుడు వార్తలే రాసి ఉంటే ఈపాటికి మాపై కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు కాదా? చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’కి అయాచితంగా వందల కోట్లు దోచి పెట్టారని ఇదే నీలిమూక ప్రచారం చేసింది. అదే నిజమై ఉంటే జగన్‌ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని నిద్రపోనిచ్చే వారా? మేం అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, జైల్లో వేస్తాం అన్నారు. రెండేళ్లు గడచినా ఏమీ చేయలేదే! అంటే మేం ఏ తప్పూ చేయలేదనే కదా! ‘ఆంధ్రజ్యోతి’ని పునఃప్రారంభించి 19 ఏళ్లు అవుతోంది. నాపై విమర్శలు చేసేవారి మాటలు నిజమే అనుకుందాం. ఈ పందొమ్మిదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదేళ్లు మాత్రమే మాతో ఘర్షణకు దిగని ప్రభుత్వం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ ప్రభుత్వాలు మా సంస్థలపై కత్తిగట్టి వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనల రూపంలో మాకు న్యాయంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వకపోయినా మేం ఎవరినీ దేబిరించడం లేదు. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు మాకు ఎంత నష్టం చేస్తున్నాయో నన్ను విమర్శించే వారికి తెలియదా? చంద్రబాబు కోసమో మరొకరి కోసమో మేం ఇంతలా నష్టపోవాల్సిన అవసరం లేదు. మేం నమ్మిన విలువలకు మాత్రమే కట్టుబడి ఉంటాం. పేటీఎం బ్యాచ్‌లో చేరిపోయి పారితోషికం కోసం నన్ను విమర్శించే వారివలె నేను ఎవరి వద్దా చేయి చాచను. అలాగైతే నేను కూడా జగన్‌ రెడ్డి, కేసీఆర్‌ వద్దకు వెళ్లి రాజీపడిపోవచ్చు కదా! మీడియా కూడా నిర్వీర్యం అయితే నోరు లేని వారికి దిక్కే ఉండదు. అందుకే ప్రశ్నించే గొంతుకగా ఉండటానికే నేను ఇష్టపడతాను. ప్రతి వారం నేను రాసే కాలమ్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యాఖ్యానాల వీడియోలను యూట్యూబ్‌లో పెట్టుకొని పలువురు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. ఇదొక రకంగా నాకు గర్వకారణమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి పాలన ఎలా ఉందో బుద్ధిజీవులు గ్రహించారు. వారంతా మాకు మద్దతుగా ఉన్నారు. మాకు సమాచారం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు. జగన్‌ రెడ్డిపై అంతులేని ప్రేమతో పాటు చంద్రబాబుపై నిలువెత్తు విషం నింపుకొన్న వారు తమ మెదళ్లకు పట్టిన బూజును వదిలించుకోకుండా విమర్శిస్తే మాకు పోయేది ఏమీ లేదు. అటువంటి వాళ్లు రాష్ట్రప్రజలకు అపకారం చేసిన వారవుతారు. మీకు నచ్చిన నాయకుడిని మీరు పొగుడుకోండి. పల్లకీలో ఊరేగించుకోండి. మీ బాటలోనే అందరూ నడవాలని కోరుకోవడం సరికాదు. జగన్‌ రెడ్డితో ఏసు ప్రభువు మాట్లాడారా? లేదా? అన్న విషయాన్ని ఏసు ప్రభువు చెప్పాలి, లేదా జగన్‌ రెడ్డి చెప్పాలి. జగన్‌ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయని ఒక అధికారి చెప్పిన విషయాన్ని మాత్రమే నేను రాశాను. అది నిజం కాదని చెప్పే అర్హత ఇతరులకు ఉండదు. ఇక మంత్రి కొడాలి నాని అయితే మేం ఏం రాసినా తమకు ఏమీ ఊడదు అనీ, ఏమీ రాలదు అనీ అన్నారు. కొడాలి నాని నోటి నుంచి వచ్చే దుర్గంధపూరిత భాష వల్ల మాకు కూడా ఏమీ ఊడదు. ఈ 19 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్నో దాడులను భరించాం. కిరాయి సైనికులుగా మారిన కొంతమంది నీలిమీడియా భాగస్వాములు చేస్తున్న విమర్శలు మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. ‘ఆంధ్రజ్యోతి’ సాగిస్తున్న ప్రయాణం సరైన దారిలోనే ఉందని మేం భావిస్తున్నాం. అది నిజం కాని పక్షంలో ఫలితాన్ని కూడా మేమే అనుభవిస్తాం. అంతేగానీ ఆర్థిక ప్రయోజనాల కోసం మా పంథాను మార్చుకోబోం!


ఆర్కే

Krishna river water dispute

 జల వివాదంలో నలుగుతున్న రైతులు


Jul 5 2021


కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టులో ఆందోళన

వచ్చిన నీటినీ వాడుకోలేని ఏపీ సర్కారు 

ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా నీరు

కాల్వలు ఎండగట్టి.. సముద్రంలోకి!

ప్రాజెక్టుల్లో ప్రతి చుక్కా ముఖ్యమే!

కాపాడుకోవాలంటున్న రైతులు, నిపుణులు

సామరస్య పరిష్కారం కోసం ఎదురుచూపులు


పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వరుసగా మూడేళ్లు జూన్‌ నెల మొదటి వారంలోనే కృష్ణా డెల్టాకు నీటిని అందించగలిగారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టిసీమను పట్టించుకోలేదు.  ఆ ఏడాది జూలై చివరిలో పట్టిసీమ నుంచి నీటి విడుదల చేశారు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి.

(విజయవాడ, నరసరావుపేట, తెనాలి-ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యం నీరై పారుతోంది. కాల్వలకు.. అక్కడి నుంచి చెరువులకు, పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. రెండేళ్లు నిండితే.. ఏడాది ఎండిపోయే కృష్ణా ప్రాజెక్టుల నుంచే నీరు వృథా అవుతోంది. దీంతో.. మున్ముందు పంటలకు నీళ్లు అందుతాయో లేదోనని సాగర్‌ ఆయకట్టు, ఇటు కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రస్తుతం జూరాల నుంచి పులిచింతల వరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. పులిచింతల నుంచి వదిలిన నీరు నేరుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని చేరుతోంది. ఈ బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు మాత్రమే. అంతకు మించి వచ్చిన నీటిని కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు అందించాలి. లేదా.. సముద్రంలోకి వదిలేయాలి. ఇప్పుడు.. నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కాల్వల ద్వారా సాగుకు నీళ్లు విడుదల చేయడం లేదు. గత 3 రోజుల్లో 1.5 టీఎంసీలకు పైగా జలాలను సముద్రంలోకి వదిలేసింది. సాగునీటికి లాకులెత్తలేదు. సోమవారం నుంచి విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.


కాల్వల్లో కన్నీరు: గతంలో కృష్ణా డెల్టాలో జూలై మొదటివారంలో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యేవి. పంట చేతికి వచ్చే సరికి నవంబరు వచ్చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి తరచూ తుఫాన్లు విరుచుకుపడటంతో పంటలు దెబ్బతినేవి. ‘పట్టిసీమ’ రూపంలో 2016 నుంచి ఈ దుస్థితి తప్పింది. జూన్‌ మొదటి వారంలోనే కాల్వలకు నీరు విడుదల చేసేలా గత టీడీపీ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. అయితే... పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణం కారణంగా పట్టిసీమ నీరు ఇప్పట్లో ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం లేకుండా పోయింది. అదే సమయం లో.. తెలంగాణ సర్కారు జలవిద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటిని వేర్వేరు కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి నీటి విడుదల ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. మూడు రోజుల క్రితం ఐఏబీ సమావేశం నిర్వహించి.. సోమవారం కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈలోపు వచ్చిన నీటిని మాత్రం వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితిపై  రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సాగర్‌ ఆయకట్టుదీ అదే కథ..

కృష్ణా డెల్టా రైతులది ఒక వ్యథ అయితే.. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉన్న నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులది మరో కథ! సాగర్‌ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌ నిండి కాల్వల్లోకి నీరు ప్రవహిస్తేనే ఇక్కడ పంటలు పండేది. ప్రస్తుతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదు. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండి.. అక్కడ గేట్లు ఎత్తితేనే సాగర్‌ చెంతకు కృష్ణమ్మ చేరుతుంది. అయితే, ‘జల విద్యుదుత్పత్తి మా హక్కు’ అంటూ తెలంగాణ సర్కారు దూకుడుగా ముందుకు వెళుతోంది. సాగర్‌ నుంచి ఇప్పటికి 26.95 టీఎంసీల నీటిని జల విద్యుదుత్పత్తి కోసం కిందికి వదిలేసినట్లు ఏపీ అధికారులు అం చనా వేస్తున్నారు. ఆదివారం సాగర్‌ నుంచి 62,134 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 21,189 క్యూసెక్కులు, పులిచింతల నుంచి 7,200 క్యూసెక్కులను జలవిద్యుత్తు కోసం వదిలారు. ఇప్పట్లో జల జగడం సద్దుమణిగే అవకాశం కనిపించడంలేదు. అంటే.. జలవిద్యుదుత్పత్తి రూపంలో మరింత నీరు దిగువకు పోతూనే ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఇప్పటికైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇది దారుణం!

పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి ద్వా రా విడుదలవుతున్న నీటిని సముద్రంలో కి వృథాగా వదలడం కంటే డెల్టాకు విడుదల చేస్తే ప్రయోజనం ఉండేది. నారుమడులు కాస్త ముందుకు జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేయడం అనైతికం.  ఆ నీటిని మన ప్రభుత్వం సముద్రంలోకి వదలడం దారుణం. 

- ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, సాగునీటి 

వినియోగదారులసమాఖ్య గౌరవాధ్యక్షుడు

వారు అడగకపోవడం వల్లే

నీటి విడుదల కోసం ప్రకాశం బ్యారేజీదిగువ ప్రాంతాల నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. కాల్వలకు ఎప్పుడు నీరు విడుదల చేయాలన్న దానిపై నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సాగుకు ఈ నెల 5 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు డెల్టా కాల్వలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నాం. 

- వరప్రసాద్‌, ప్రకాశం బ్యారేజీ డీఈ


Jul 5 2021 @ 13:43PMహోంఆంధ్రప్రదేశ్జల జగడంపై కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ లేఖఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను విద్యుదుత్పత్తికి వాడుకుంటోందని, కేఆర్‌ఎంబీ ఆదేశించినా వినకుండా జలాలను వినియోగించుకుంటోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన 34 జీవో పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. రాయలసీమకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, అదనపు ఆయకట్టు లేదని, కేటాయించిన నీటినే వాడుకుంటామన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేఆర్‌ఎంబీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ పథకాలు నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అక్రమ ప్రాజెక్టులను సందర్శించి నిలిపివేయాలని కోరినా కేఆర్‌ఎంబీ వెళ్లలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వద్దకు వస్తామని లేఖలు రాస్తున్నారని, తమ వద్దకు వచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించాల్సిందేనని  సీఎం జగన్‌ అన్నారు.

అక్కడ ప్రాజెక్టులను సందర్శించకుండా ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలని, రిజర్వాయర్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. తటస్థంగా ఉండాల్సిన కేఆర్‌ఎంబీ అధికారులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కేఆర్‌ఎంబీ అధికారులకు తగిన సూచనలు చేయాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆ లేఖలో కోరారు.