Saturday 6 June 2020

డీపీఆర్‌లు ఇవ్వండి- తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు

Jun 5 2020 @ 03:12AMహోంతెలంగాణ

డీపీఆర్‌లు ఇవ్వండి కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
ప్రభుత్వాలతో మాట్లాడి చెప్తామన్న అధికార్లు
పట్టిసీమలో 45 టీఎంసీల వాటా ఇవ్వాలి
సాగర్‌లోని 50 టీఎంసీలు క్యారీ ఓవరే
పోతిరెడ్డిపాడుతో 175 టీఎంసీలు తోడారు
పోతిరెడ్డిపాడు విస్తరణ,
రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయాలి: తెలంగాణ
మా కోటా నీటి వాడకానికే ఆ ప్రాజెక్టులు: ఏపీ
తెలంగాణ వాదనలో మోదీ ఎన్నికల ప్రసంగం
ఈ ఏడు కూడా పాత పద్ధతినే కేటాయింపులు


హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జల సౌధలో గురువారం ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM




తెలంగాణ తరఫున సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం ఇంజనీర్లు, ఏపీ నుంచి సాగు నీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత డీపీఆర్‌లు సమర్పిస్తామని అధికారులు బోర్డుకు తెలిపారు.



వాటిని ఆపేయండి.. కోటా మార్చండి

తొలుత తెలంగాణ అధికారులు తమ వాదన వినిపించారు. ప్రత్యేక ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ ప్రాజెక్టులకు నష్టం కలిగించే, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న కోటా (తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు)లో మార్పులు చేయాలని కోరారు. తాగు నీటి కోసం కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నదాంట్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న 50 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని, వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.



పోతిరెడ్డిపాడు నుంచి ఏడాదికి 101 టీఎంసీలను మాత్రమే తరలించాల్సి ఉండగా.. ఏపీ గతేడాది 175 టీఎంసీలను తీసుకుందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డిపై ఏపీ ఫిర్యాదును ప్రస్తావిస్తూ, వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, దీనికి సాక్ష్యంగా 2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీచేసిన ప్రసంగాన్ని వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి పాత ప్రాజెక్టేనని చెప్పడమే తమ ఉద్దేశమని తెలంగాణ అధికారులు వివరించారు.



మా ప్రాజెక్టులనూ రీ డిజైన్లుగానే చూడండి

కృష్ణా బేసిన్‌లో తమ కోటా నీటి వినియోగానికే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతలను చేపడతున్నట్లు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు రీ డిజైన్‌ అయినప్పుడు, తమవాటినీ అలాగే భావించాలన్నారు. రాష్ట్ర విభజన 2014లో జరిగినందున.. తర్వాత జారీ చేసిన జీవోలన్నీ కొత్త ప్రాజెక్టుల కోసమనే పరిగణించాలని కోరారు. ఈ లెక్కన పాలమూరు-రంగారెడ్డి, డిండి కొత్త ప్రాజెక్టులేనని అన్నారు. అనుమతులు వచ్చేవరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని బోర్డు సూచించింది.



బోర్డు తీసుకున్న నిర్ణయాలు..

గత ఏడాదిలానే బేసిన్‌ నీటిని రెండు రాష్ట్రాలు 66: 34 శాతం నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి. నీటి లెక్కలు తేలేవరకు వాడకం ఇదే పద్ధతిన సాగాలి.
టెలీమెట్రీ యంత్రాల రెండో దశ ఏర్పాటును కచ్చితంగా అమలు చేయాలి.
శ్రీశైలం జల విద్యుత్‌ను చెరిసగం వాడుకోవాలి.
బేసిన్‌లో మిగులు జలాలను సమానంగా వాడుకోవాలి. 2019-20లో ఉపయోగించుకున్న మిగులు నీటి లెక్కల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలి.
సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో నీటి నష్టంపై ఇప్పటికే నియమించిన కమిటీ క్షేత్ర పరిశీలన చేయాలి.
తాగునీటికి అవసరాలకు కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై కేంద్ర జల సంఘానిదే తుది నిర్ణయం.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ఉన్న తెలంగాణ నీటి వాటాను క్యారీ ఓవర్‌గా పరిగణించడంపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకుని, బోర్డు మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి వస్తుంది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న గోదావరి నీటిలో తెలంగాణ వాటాను తేల్చే అంశం, కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలింపుపై నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అప్పగింత.


నేడు గోదావరి బోర్డు సమావేశం

గోదావరి బోర్డు శుక్రవారం సమావేశం కానుంది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈ అంశాలపై చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

గోదావరి పై కొత్త ప్రాజెక్టులు ఆపేయండి

Jun 6 2020 @ 02:43AMహోంతెలంగాణ

గోదావరి పై కొత్త ప్రాజెక్టులు ఆపేయండి

అనుమతి లేని వాటిని నిర్మించొద్దు

పదో తేదీలోగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లివ్వండి

తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు చైర్మన్‌ ఆదేశం

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల్లేవ్‌.. కాళేశ్వరం కొత్తదే: ఏపీ

మా వాటా 967 టీఎంసీల వాడకానికే ఈ ప్రాజెక్టులు

పోలవరం ముంపుపై మళ్లీ సర్వే జరగాలి.. తెలంగాణ డిమాండ్‌


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను జూన్‌ 10వ తేదీలోగా సమర్పించాలని గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులను పొందేందుకు వీలుగా డీపీఆర్‌లను సమర్పించాలని సూచించింది. అనుమతులు పొందాకే ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగించాలని కోరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో నీటి వాడకాన్ని అంచనా వేయడానికి వీలుగా టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని, ఈ అంశంపై ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. గోదావరి బోర్డు సమావేశం శుక్రవారం జలసౌధలో జరిగింది. బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాన చర్చ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణపై జరిగినట్టు సమాచారం. కాళేశ్వరంతో పాటు, దేవాదుల మూడవ దశ, రామప్ప నుంచి పాకాల, సీతారామ వంటి ఏడు ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసింది. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు తెలంగాణ స్పష్టం చేసింది. దీనిని పాత ప్రాజెక్టుగానే గుర్తిస్తున్నట్టు కేంద్రం కూడా లేఖను రాసిందని అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఫిర్యాదులను పట్టించుకోకుండా, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా లేఖ రాస్తుందని ఏపీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్థలం మారిందని, ఉపయోగించే నీటి సామర్థ్యం పెరిగిందని, ఆయకట్టు మారిందని, దిగువకు వచ్చే నీటి ప్రవాహంలో భారీగా తగ్గిపోతోందని ప్రస్తావించారు. తెలంగాణ ప్రాజెక్టులకు బోర్డు అనుమతి కానీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు కానీ లేవని ఆరోపించింది. తమకు కేటాయించిన 967 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికే ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలంగాణ అధికారులు వివరించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని చెప్పారు.

పట్టిసీమ నుంచి కృష్ణాకు తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాల్సి ఉందని బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ట్రైబ్యునల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని తెలంగాణ అధికారులు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం అధికారులు సర్వే నిర్వహించారని, దేశంలో కేంద్ర జలసంఘం కన్నా అత్యున్నత సంస్థ లేదని ఆంధ్రప్రదేశ్‌ బదులిచ్చింది. ఇరు రాష్ర్టాల వాదనల అనంతరం బోర్డు కొన్ని నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనది.. ఈ నెల 10లోపు రెండు రాష్ట్రాల్లో గోదావరి కింద చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరు ప్రభుత్వాలు సమర్పించాలి. గోదావరి బేసిన్‌పై ఎక్కడెక్కడ టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలనే అంశాన్ని ఖరారు చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది..

కొత్తప్రాజెక్టులు చేపట్టలేదు: రజత్‌కుమార్‌

గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టలేదని బోర్డుకు స్పష్టం చేశామని సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ చెప్పారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న నీటి కోటాను ఉపయోగించుకోవడానికే ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు 967 టీఎంసీల నీటి కోటా ఉన్నట్టు అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనను, ఇచ్చిన ఉత్తర్వులను బోర్డు దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ కూడా తెలంగాణకు 967.14 టీఎంసీలు కేటాయించిందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 445 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు నుంచి అదనంగా నీటిని తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ మీద ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గోదావరిలో ఎక్కడెక్కడ, ఎన్ని టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలనే దానిపై నివేదిక ఇస్తారని చెప్పారు. కాళేశ్వరాన్ని 225 టీఎంసీలకు డిజైన్‌ చేసి, 400 టీఎంసీలు తీసుకువెళ్తున్నారని ఏపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తర్వాతే నిర్మాణాలు: బోర్డు చైర్మన్‌ అయ్యర్‌

గోదావరి నదిపై చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపునర్విభజన చట్టం కింద బీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతుల కోసం డీపీఆర్‌లను సమర్పించాల్సి ఉందని చెప్పారు. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.

దీనిపై కేంద్రానికి నివేదిక ఇచ్చామన్నారు. రెండు రాష్ట్రాలకు లేఖలను కూడా రాసినట్టు వివరించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు వచ్చిన తర్వాతనే నిర్మాణాలను చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రతిపాదనకు సంబంధించి సమస్యలను పరస్పరం పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గోదావరి బేసిన్లో టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అంతర్‌ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద తగిన ప్రాంతాలను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్తవాటికి బ్రేక్‌

గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి
10లోగా డీపీఆర్‌లు సమర్పించండి
తెలుగు రాష్ట్రాలకు జీఆర్‌ఎంబీ ఆదేశం
బోర్డు భేటీలో ఆంధ్ర ఫిర్యాదుపై చర్చ
సమగ్ర నివేదిక సమర్పణకు తెలంగాణ సమ్మతి
టెలిమెట్రీలపై జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీ

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపేయాలని గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. వాటన్నిటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని నిర్దేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 225 టీఎంసీలు, జీఎల్‌ఐఎ్‌స-3కి 22 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 110 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 23.76 టీఎంసీలు, ఇతరత్రా పథకాలతో కలిపి మొత్తం 450.31 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తోందని ఆంధ్ర తన ఫిర్యాదులో పేర్కొనగా.. ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. గోదావరిలోని 1,426 టీఎంసీల జలాల్లో 650 టీఎంసీలు తెలంగాణకు.. 776 టీఎంసీలు తమకు దక్కుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఈ సమావేశంలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 660 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116 టీఎంసీలు దక్కుతాయని వివరించింది.


తెలంగాణ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 472 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178 టీఎంసీలు.. మొత్తం 650 టీఎంసీలు వాటాగా వినియోగించుకునే వీలుందని పేర్కొంది. కాగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటికి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని.. సాంకేతికాంశాలు కొన్ని చూపుతున్నందున వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డీపీఆర్‌లను సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవే అయినందున.. డీపీఆర్‌లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదించారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణఱ భూభాగంలో సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించినందునే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించాకే.. డీపీఆర్‌లను సమర్పిస్తామన్నారు. అయితే డీపీఆర్‌లను సమర్పించాల్సిందేనని జీఆర్‌ఎంబీ తేల్చిచెప్పింది. ఇందుకు తెలంగాణ సరేనంది. ఆంధ్ర కూడా అంగీకరించింది. ఈ నెల పదో తేదీలోపు వాటిని సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి. పెద్దవాగు ప్రాజెక్టు అంశాన్ని రెండు రాష్ట్రాలూ కలసి పరిష్కరించుకునేందుకు సరేనన్నాయి. రెండు రాష్ట్రాల్లో టెలిమెట్రీల ఏర్పాటుకు జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీని వేయాలని తీర్మానించాయి.

స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు: చైర్మన్‌

బోర్డు సర్వసభ్య సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆ  తర్వాత విలేకరులకు వెల్లఇంచారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 తర్వాత గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘానికి, బోర్డుకు సమర్పించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమ్మతిని పొందేందుకు తెలంగాణ అంగీకరించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సప్లిమెంటరీ డీపీఆర్‌లను ఇవ్వడానికి సమ్మతించిందని చెప్పారు. గోదావరి జలా ల వినియోగాన్ని లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీల ఏర్పాటుకు వీలుగా జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, జలసంఘం, పుణేలోని సీడబ్ల్యుపీఆర్‌కు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.