Tuesday, 19 May 2020

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందన ఇది..

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందన ఇది..

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ నిర్మిస్తున్న 5 ప్రాజెక్ట్‌లు పునర్‌విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఏపీ ఫిర్యాదు చేసిందని కృష్ణా రివర్ బోర్డు తెలిపింది. నిర్మాణంలో ఉన్న మరో 3 ప్రాజెక్ట్‌లు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదు అందిందని కృష్ణా రివర్‌ బోర్డ్‌ పేర్కొంది. ఈ విషయాలపై వెంటనే వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్‌ శాఖకు కృష్ణా రివర్‌ బోర్డు లేఖ రాసింది.


కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ సారాంశం..

రాష్ట్ర విభజన చట్టంలోని 84, 85 సెక్షన్లు, 11వ షెడ్యూల్‌ ప్రకారం కేఆర్‌ఎంబీ, కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలి. రాష్ట్ర విభజన జరిగాక మిగులు జలాల పేరిట కృష్ణా ట్రైబ్యునల్‌ -1 ఆమోదం లేకుండానే 16.87 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం 150.53 టీఎంసీల సామర్జ్యం కలిగిన 5 కొత్త ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టింది. ఇది కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించడమే.


అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ, కేంద్ర జల సంఘం ఆమోదం కూడా తీసుకోలేదు. మేం ఈ అంశంపై పదే పదే ఫిర్యాదు చేయడంతో తెలంగాణ నుంచి డీపీఆర్‌ను తీసుకోవాలని కృష్ణా బోర్డుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సూచించింది. బోర్డు ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని తెలంగాణ.. దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు అన్యాయం చేసేలా ప్రాజెక్టులను నిర్మిస్తూనే ఉంది.

Thursday, 31 October 2019

బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలను ఎందుకు తరలించలేక పోయారు?

బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలను ఎందుకు తరలించలేక పోయారు?

1. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్టులకు, కె.సి.కెనాల్, చెన్నయ్ నగరం మరియు రాయలసీమ ప్రాంత త్రాగు నీటి అవసరాలకు కృష్ణా నదీ జలాల తరలింపు వీలౌతుంది.

2. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతూనే ఉన్నది. ఆగస్టు 4 వ తేదీకి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరుకొన్నది. రెండు నెలలుగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా నీటితో తొణికిసలాడుతున్నది. నాలుగు సార్లు గేట్లు ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి దాటుకొని దాదాపు 400 టియంసిల నీరు సముద్రగర్భంలో కలిసిపోయింది. 

3. శ్రీశైలం జలాశయం నుండి 30 రోజుల్లో 114 టియంసిల నీటిని తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరును 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించబడింది. పోతిరెడ్డిపాడు నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కర్నూలు జిల్లాలో 16.95 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన వెలుగోడు రిజర్వాయరుకు ముందు నీరు చేరుతుంది. వెలుగోడు రిజర్వాయరును ఈ ఏడాది కూడా  నీటితో నింపారు. 

 4. వెలుగోడు నుండి కడప జిల్లాలో నిర్మించబడిన సబ్సిడరీ రిజర్వాయర్స్ బండ్ 'ఎ', బండ్ 'బి' వరకు, అటుపై బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు నీటిని తరలించడానికి 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ నిర్మించబడింది. 

5. తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా 17.74  టియంసిల సామర్థ్యంతో కడప జిల్లాలో నిర్మించబడిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కేవలం 0.8 టియంసిలను మాత్రమే ఈ ఏడాది తరలించారు. ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ 'వెబ్ సైట్' తాజా సమాచారం మేరకు బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 2.62 టియంసిల నిల్వ ఉన్నది. అంటే అంతకు ముందు రిజర్వాయరులో నిల్వ ఉన్న నీటికి ప్రస్తుతం దాదాపు ఒక టియంసి మాత్రమే చేరింది. గతంలో బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 12, 13 టియంసిలు నిల్వ చేసి పోరుమామిళ్ళ, బద్వేల్ చెరువులకు నీటిని సరఫరా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి, ఈ ఏడాది ఎందుకు మఠం రిజర్వాయరుకు నీటిని తరలించలేక పోయారు అన్నదే ప్రశ్న. లోపమెక్కడుంది ?

6. కారణాలేంటో తెలుసుకొందామని తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలో పని చేస్తున్న ఇంజనీర్లతో మాట్లాడా. వెలుగోడు రిజర్వాయరు నుండి 3,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే, కర్నూలు - కడప జిల్లాల సరిహద్దు చేరేటప్పటికి 1,800 క్యూసెక్కులు, బండ్ (ఎ), (బి) చేరేటప్పటికి 1300 క్యూసెక్కులు, బి.మఠం రిజర్వాయరుకు 1,019 క్యూసెక్కులు మాత్రమే అంత్యమంగా చేరుతున్నాయని తెలియజేశారు. కారణం, తెలుగు గంగ ప్రధాన కాలువ 98.6 కి.మీ. నుండి అంటే కర్నూలు - కడప జిల్లాల సరిహద్దు నుండి ప్రధాన కాలువకు "లైనింగ్" చేయక పోవడం పర్యవసానంగా నీరు వృధాగా పొలాల్లోకి వెళుతున్నదని చెప్పారు. అంటే, అంత నాసిరకంగా ప్రధాన కాలువను నిర్మించారా! అన్న అనుమానం రాకమానదు. 

7. "లైనింగ్" పనుల కాంట్రాక్టును రు.280 కోట్లకు తీసుకొన్న సి.యం.రమేష్, యాదవ్ లు నిర్మాణ పనులు చేపట్టక పోవడం వల్ల నీరు అందుబాటులో ఉన్నా తరలించుకోలేని దుస్థితి నెలకొన్నదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన కాలువ 'లైనింగ్' పనులకు "రీ టెండరింగ్" పిలవాలని ఆలోచిస్తున్నదని చెప్పారు.

8. కుందూ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల వర్షంపడి వరద వచ్చినప్పుడు 3500 క్యూసెక్కుల వరకు అదే కాలువ గుండా నీరు ప్రవహించింది కదా! అంటే దానికి సరియైన సమాధానం లభించలేదు.  

9. శ్రీశైలం జలాశయం నుండి 29 టియంసిల కృష్ణా వరద నీటిని  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించి కర్నూలు జిల్లాలో 1,08,000 ఎకరాలకు, కడప జిల్లాలలో 1,67,000 ఎకరాలకు, మొత్తం 2,75,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలి. అలాగే 30 టియంసిల పెన్నా నది జలాలను నెల్లూరు జిల్లాలో 2,54,000, చిత్తూరు జిల్లాలో 46,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వాలి. మొత్తం ఆయకట్టు 5,75,000 ఎకరాలు. 

చెన్నయ్ నగరానికి 15 టియంసిల నికర జలాలను త్రాగు నీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతం త్రాగు నీటికి కోసం నీటిని తరలించాల్సి ఉన్నది.

10. తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలోని వెలుగోడు రిజర్వాయరులో 16.47 టియంసిలు (గరిష్ట నిల్వ సామర్థ్యం 17.95 టియంసిలు) నిల్వ ఉన్నది. నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు 70 టియంసిలు(గరిష్ట నిల్వ సామర్థ్యం 78 టియంసిలు), కండలేరు రిజర్వాయరుకు 17 టియంసిల(గరిష్ట నిల్వ సామర్థ్యం 68 టియంసిలు) నీరు తరలించబడింది. ఒక్క బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు మాత్రం నీటిని తరలించ లేదు.

11. ప్రభుత్వ అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి, నాసిరకం నిర్మాణాలకు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రబల నిదర్శనంగా నిలిచింది. ప్రాజెక్టు పరిథిలో పంట కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించ లేదు.

12. కృష్ణా నది వరద నీరు దాదాపు 400 టియంసిలు సముద్రం పాలైన పూర్వరంగంలో కూడా కరవు పీడిత ప్రాంతానికి నీటిని తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించ లేదని చెప్పక తప్పదు. 

- టి.లక్ష్మీనారాయణ
నీటి పారుదల రంగ విశ్లేషకులు

Thursday, 22 August 2019

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
22-08-2019 12:05:59

అమరావతి: ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ‘‘ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసింది. కేవలం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుంది. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, మేము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తాం’’ అని ‘నవయుగ’ సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి కుదిరిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్ట్ 14వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నవయుగ సంస్థ హైకోర్టులో సవాల్‌ చేసింది.

‘మా మాట వినండి! పోలవరం టెండర్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం... పైగా, ఈ సూచన చేసిన 24 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రీటెండర్‌ నోటిఫికేషన్‌తో సహా తమకు అందజేయాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్‌ను కోరిన విషయం విదితమే. పోలవరం ‘రివర్స్‌ టెండర్‌’ ప్రతిపాదనలపై ఆగస్ట్ 13న పీపీఏ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది.

పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసేందుకు, తిరిగి టెండర్లు పిలిచేందుకు ఎటువంటి కారణాలు లేవని... ‘రివర్స్‌’ వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని తేల్చింది. దీనివల్ల సామాజిక-ఆర్థిక పర్యవసానాలు కూడా ఉంటాయని కూడా తెలిపింది. ఇవే విషయాలను వివరిస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆర్కే జైన్‌ లేఖ రాశారు. రివర్స్‌ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని, కనీసం కేంద్రం నుంచి సూచనలు వచ్చేదాకా ఆగాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌పై ముందుకెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా.. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని
Aug 22, 2019, 20:39 IST
 Kodali Nani Slams Chandrababu, Devineni Uma about Palavaram - Sakshi
పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది..

సాక్షి, అమరావతి :  పోలవరంపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చిందే కాని చంద్రబాబు నాయుడు చుట్టాలకు ఆ పనులు అప్పగించాలని చెప్పలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ‍్యానించారు. ఎవరైనా కోర్టుకు వెళితే స్టే ఇవ్వడం సహజమేనని, ఆ మాత్రం దానికే టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు మారితే అంతకు ముందు నిర్మాణ సంస్ధల నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమా ఏడుస్తున్నారని ఆరోపించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని టీడీపీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అవినీతి నిర్మూలనలో అనేక వత్తిడులు ఎదురవుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలవరంపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.

రాజధానిపై అనవసర రాద్దాంతం
రాజధానిపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనవర రాద్దాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, రాజధానిని అమరావతి నుంచి తీసివేస్తామని ఆయన చెప్పలేదని స్పష్టం చేశారు. కృష్ణానదికి పెద్దగా వరదలు వచ్చినా, గట్టిగా వర్షాలు కురిసినా అమరావతి మునిగిపోతుందని ఆయన చెప్పారన్నారు. అందులోని లోపాలను గురించి బొత్స వివరించారని పేర్కొన్నారు.  ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భవన నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు అనుభవించక తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు.


పోలవరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: సుజనా
22-08-2019 19:30:07

అమరావతి: పోలవరంపై రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్వాగతించారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందని చెప్పారు. ఈ తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిస్తున్నామన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి ఉంటే బాగుండేదని సూచించారు. సాక్షాత్తూ జపాన్ ప్రభుత్వం సైతం ఈ ప్రభుత్వ చర్యలు అభివృద్దికి దోహదపడవని లేఖ రాసిందని గుర్తుచేశారు. అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. వ్యక్తిగత అహంభావాలకు, పంతాలకు పోకుండా పోలవరం సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదు: అనిల్‌
22-08-2019 17:43:30

విజయవాడ: హడావుడిగా రూ.220 కోట్ల టెండర్లు వేశారని మంత్రి అనిల్‌ ఆరోపించారు. హడ్కో నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్ల ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అన్ని వర్గాలవారికీ భవన నిర్మాణ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదని ఆయన చెప్పారు. రివర్స్ టెండర్లకు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకంత భయమని ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వం అన్ని విషయాల్లో అవినీతికి పాల్పడిందని, మంత్రి బొత్స సత్యనారాయణ కేవలం శివరామకృష్ణ కమిటీ నివేదికనే గుర్తు చేశారని అనిల్ పేర్కొన్నారు.

పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టేనే ఇచ్చింది: కొడాలి నాని
22-08-2019 17:36:52

అమరావతి: పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని మంత్రి కొడాలి నాని అన్నారు. అంతేకాని చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదన్నారు. కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దనేదే జగన్‌ లక్ష్యమని వెల్లడించారు. మంత్రి బొత్స వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశాం.. దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.


Thursday, 14 December 2017

పోలవరంపై విషం చిమ్మొద్దు

పోలవరంపై విషం చిమ్మొద్దు
15-12-2017 02:50:27


రైతు భరోసాను దెబ్బతీయొద్దు
రాష్ట్రానికి నష్టం చేయొద్దు: సీఎం
విమానాశ్రయంలో రైతుల ఘనస్వాగతం
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వరప్రదాయిని, జీవన రేఖలాంటి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మొద్దని.. రైతాంగం పెట్టుకున్న భరోసాను.. ధైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రానికి.. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని కోరారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి కృష్ణా డెల్టా రైతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు.

సీఎం అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో దాదాపు నాలుగు గంటలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, ఉన్నతాధికారులు, రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఇందులో పాల్గొన్నారన్నారు. గడ్కరీతో చర్చల తర్వాత పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయగలమన్న భరోసా వచ్చిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేలా విభజన జరిగిందని, కట్టుబట్టలతో వచ్చేశామని గుర్తుచేశారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై పడిందన్నారు. ‘రాష్ట్ర విభజన జరిగాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది పూర్తయ్యేలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు నీరందించాలని నిర్ణయించాం. పట్టిసీమను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వారి మాట విని కట్టకుండా ఉంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారేది. దీనిని పూర్తిచేయడం వల్లే ఖరీ్‌ఫలో బ్రహ్మాండమైన పంట దిగుబడులు వచ్చాయి’ అని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పట్టుదలతో పట్టిసీమను పూర్తిచేయడంతో రైతులకు తనపై పూర్తి నమ్మకం కలిగిందన్నారు. ఈ పథకాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే ప్రశ్నించాలని కృష్ణా డెల్టా రైతులకు సూచించారు.

‘ఆంధ్రజ్యోతి’ వార్త చదివాక గుండె బరువెక్కింది
పోలవరం టెండర్లను ఆపాలని కేంద్రం ఆదేశించినట్లు పేపర్లో వచ్చిన వార్తను చదివాక గుండె బరువెక్కిందని ముఖ్యమంత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. దక్షిణ కొరియా నుంచే గడ్కరీతో ఫోన్లో మాట్లాడానని, మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిపారు. ప్రాజెక్టు సమస్యలపై బుధవారం గడ్కరీతో సంపూర్తిగా చర్చించామని.. కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ప్రస్తుత కాంట్రాక్టు సంస్థకు నెల రోజులు గడువిచ్చారని.. లక్ష్యాలను చేరుకోలేకపోతే.. మర్నాడే కొత్త సంస్థకు కాంక్రీట్‌ పనుల బాధ్యతను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.

కొంతమంది కావాలనే పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘2013 భూ సేకరణ చట్టం అమల్లోకి రాకముందే భూసేకరణ చేపట్టి ఉంటే.. రూ.2900 కోట్లు వ్యయమయ్యేది. ఇప్పుడా చట్టం అమల్లోకి రావడంతో.. భూ సేకరణ వ్యయం 11 రెట్లు పెరిగి రూ.33,000 కోట్లకు చేరుకుంది.

ప్రధాన పనుల వ్యయం మాత్రం రెండింతలు పెరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రతిపక్షాలు అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు.. రాష్ట్రం చేసిన వ్యయాలు.. ఏ కాంట్రాక్టు సంస్థకు ఎంత చెల్లింపులు జరిపారో ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. శ్వేతపత్రాన్ని కోరుతున్న వారు ఆన్‌లైన్‌లోనే లెక్కలు చూసుకోవచ్చు. ప్రతిపక్షాలు విజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర రాద్ధాంతం సృష్టించి అన్యాయం చేయొద్దు’ అని కోరారు.

కంకుల సందడి..
తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు విమానాశ్రయంలో సందడి చేశారు. పట్టిసీమ నీటితో పండించిన పంటను తీసుకువచ్చి కంకుల దండను సీఎం మెడలో వేశారు. డప్పు వాయిద్యాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మారుమోగింది. సీఎంకు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్‌, బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.

గడ్కరీ రాక 23న
కాగా.. పోలవరం సందర్శనకు గడ్కరీ ఈ నెల 23న రానున్నారు. తొలుత ఆయన పర్యటన 22న ఉంటుందని భావించారు. అయితే.. 23న విజయవాడకు వస్తారని.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పనులను సమీక్షిస్తారని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

Friday, 27 October 2017

పోలవరంపై ఏంచేద్దాం?

పోలవరంపై ఏంచేద్దాం?
28-10-2017 04:02:04

నేడు ముఖ్యమంత్రి నిర్ణయం.. అంచనాలు పెంచలేమన్న గడ్కరీ
 అధిక ధరను రాష్ట్రమే భరించాలని సూచన
 సీఎంకు నివేదించిన జల వనరుల శాఖ
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు చేపట్టిన ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొన్ని పనులు తప్పించి.. ఈ-టెండర్ల ద్వారా వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయనతో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్‌ఈ రమేశ్‌బాబు తదితరులు భేటీ అయ్యారు. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశ వివరాలను ఆయనకు వివరించారు. శనివారం మరోసారి భేటీ అయి ఏం చేయాలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వారితో అన్నారు. ‘ఈపీసీ విధానంలో పోలవరం ప్రాజెక్టుకు తాజా టెండర్లను పిలిస్తే.. అంచనాలను సవరించేందుకు ఆస్కారం లేదు. ఇలా అంచనాలను పెంచితే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుపట్టవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకూ ఆస్కారం లేకపోలేదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకూ సుముఖగా లేం’ అని గడ్కరీ తమకు తేల్చిచెప్పారని అధికారులు సీఎంకు తెలియజేశారు. ‘సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఆర్థిక రంగ నిపుణుడు, రిటైర్డ్‌ బ్యాంకు అధికారితో ఆర్బిట్రేషన్‌ కమిటీ వేయాలని గడ్కరీ సూచించారు. ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి రూ.1000 కోట్ల విలువైన పనుల నుంచి తప్పించి వేరే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అంగీకరించలేదు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పారు. పైగా.. ట్రాన్‌స్ట్రాయ్‌కే సహకారం అందించాలని, సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు నేరుగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఎస్ర్కో అకౌంట్‌ను తెరవాలని సూచించారు. ఒకవేళ ఈ- టెండర్లను పిలిస్తే.. ట్రాన్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన -14.05 శాతం కంటే ఎక్కువ ధరను చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అధిక మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేశారు’ అని వివరించారు.

పోలవరంపై దోబూచులు! 8 సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చారని, ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రం కేంద్రానికి లొంగి ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

Tuesday, 9 May 2017

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు
10-05-2017 04:39:49
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి.. నిర్వాసితులైన పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు మండలాల్లోని 34 గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1660 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. వచ్చేఏడాది గ్రావిటీతో పోలవరంలో నీరు నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున ఇచ్చాం. కొంత మంది రైతులకు వడ్డీతో సహా రూ.10.92 లక్షల చొప్పున ఖాతాలో జమ చేశాం. కుక్కనూరు, వేలేరుపాడు, జీడుగుమల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో 34 గ్రామాల్లోని 14,043 ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఇందుకుగాను నిర్వాసితులకు రూ.1502 కోట్లు చెల్లించాం. అదేవిధంగా 1505 ఎకరాల అసైన్డ్‌ భూములకు సంబంధించి నిర్వాసితులకు రూ.158 కోట్లు చెల్లించాం. మొత్తం నాలుగు మండలాల్లో 15,548 ఎకరాలకు రూ.1660.75 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం’ అని వివరించారు.

నష్టపరిహారం చెల్లింపునకు కృషిచేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికారులను అభినందించారు. రైతులకు చెల్లించిన నష్టపరిహారానికి చెందిన బిల్లులను పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖకు, నాబార్డుకు పంపిస్తామని, వాటిని పరిశీలించి కేంద్రం ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వానికి రీయింబర్స్‌ చేస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7500 వందల ఎకరాలకు రూ.800 కోట్లు అవసరమని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. పోలవరం కాంక్రీట్‌, ఎర్త్‌, డయాఫ్రం వాల్‌ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌ టీ-బావర్‌ సంస్థ 633 మీటర్లలో 203 మీటర్ల పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. నవంబరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

Thursday, 12 January 2017

Detailed Project Reports (DPRs)

డీపీఆర్‌ ఉంటేనే.. ప్రాజెక్టులకు అనుమతి!
Sakshi | Updated: January 13, 2017 02:56 (IST)
కొత్త మార్గదర్శకాలు రూపొందించిన కేంద్ర జల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఉంటే అనుమతులు లభించనున్నాయి. డీపీఆర్‌లు సమర్పిస్తేనే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన హైడ్రాలజీ, నీటి పారుదల ప్రణాళిక, డిజైన్లు, అంచనాలకు ఆమోదం తెలుపుతామని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల వ్యవధిని గణనీయంగా తగ్గించేందుకు.. ఏళ్లకేళ్లు జాప్యం జరిగి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఎన్నో అనుమతులు కావాలి..
సాధారణంగా ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జల సంఘం అనుమతి తోపాటు సైట్‌ క్లియరెన్స్, అంతర్రాష్ట్ర వ్యవహారా లు, పర్యావరణ, అటవీ, ప్రణాళికా సంఘం..  అనుమతులు  తీసుకోవాల్సి ఉంటుంది.

అధ్యయన నివేదికలూ ఇవ్వాల్సిందే..
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టు అనుమతులు వేగంగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి తయారు చేసిన డీపీఆర్‌ కచ్చితంగా ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్‌లో నీటి లభ్యత (హైడ్రాలజీ), నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజె క్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు వంటి అంశాలపై చేసిన అధ్యయన నివేదికలు పొందుపరచాలి. ఆ డీపీఆర్‌ను సీడ బ్ల్యూసీ పరిశీలించి..అవసరమైన మార్పులు, చే ర్పులు సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్పులు చేసి తుది డీపీఆర్‌ రూపొందించాలి. దానిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకు ప్రజెంటేషన్‌ ఇవ్వాలి.

ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ అంగీకారం తెలుపుతుంది. తర్వాత 3 వారాల్లోగా హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక, 2 వారాల్లోగా అంతర్రాష్ట్ర అనుమతులు ఇస్తారు. డిజైన్లకు 2 నెలల గడువు పట్టనుండగా.. అంచనా లు, ఆర్థిక మదింపు, సాంకేతిక సలహా మండలి నివేదిక అనుమతుల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేస్తారు. ఇక ఆయకట్టు అభివృద్ధి ప్రణాళిక, వ్యయ ప్రయోజనాల నిష్పత్తి (కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో) లను స్పష్టం చేస్తూ వ్యవసాయ శాఖ నుంచి నీటి పారుదల ప్రణాళిక డైరెక్టరేట్‌కు సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. నిర్మాణాలు చేపట్టి ఆపై అనుమతుల అంశాన్ని సాకుగా చూపుతూ, ప్రాజెక్టుల వ్యయాలను పెంచే స్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పాటిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.